Wednesday 21 November 2018

పిఠాపురం

పిఠాపురం
"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
(శ్రీనాధుడు భీమేశ్వర పురాణం )
పీఠికాపురమది ఘనపీఠమనగ
దేవళముల కూడలిదియు దివ్యమైన
ధామము పవిత్ర జలముల తటము నందు
స్నానమాచరించినతోడ సకల శుభము !!
కుక్కుటేశ్వరుడైనాడు కోకనదుడు
యా పురూహూతికమనకు నంబ కాగ
శక్తి పీఠమిదియె దత్త స్వామి నిచట
పరిమళించెను శ్రీపాద వల్లభునిగ !!
ఆ గయాసురుఁ యొడలది యజ్ఞ వాటి
ఘనత కలిగిన భక్తుని కలిలమదియు
తాకినంతనె జీవుల తరల చేయు
పాద గయగ పిలువబడు ప్రస్తుతంబు !!
దివ్య మైనట్టి గుడులతో భవ్య మౌగ
పీఠికాపురంబదియును విజయమొసగు
భక్త వరులకు కన్నుల పండుగాయె
చూచి వద్దము రండయ సుజనులార !!
కాకినాడకు చేరువన్ కలదు పురము
కార్తికమున హరిహరుల గాంచుటనగ
పుణ్య ప్రదమగు పరమును పొంద గలము
శివుని కొల్చుట శుభమగు చేరి మనకు !!
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో పై విధంగా చెబుతాడు.
పాదగయ క్షేత్ర వివరణ
కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
గంగా తీరమున ఉన్న గయ "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. .కుక్కుటేశ్వర దేవాలయంఈ దేవాలయం కోనేరుకు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. దేవాలయం ఎదురుగా కల ఏకశిల నంది అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొద్దిగా దిగువగా ఉంటుంది. ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి.కుక్కుటేశ్వరస్వామి
ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం
పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం,శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం"గా ఏర్పాటు చేయబడింది, శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు,భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు,మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు ఉన్నాయి.

No comments:

Post a Comment